Saturday, October 29, 2011

జర్నలిజం ముసుగులో రాధాకృష్ణ శాడిజం

radhakrishna abn andhrajyothi
జర్నలిజం ముసుగులో రాధాకృష్ణ శాడిజం


జర్నలిజం ముసుగులో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ శాడిజం, రౌడీయిజం చూపుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. ఈ మధ్యాహ్నం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ అధినేత తరపున తాము మాట్లాడితే కుక్కలు, నక్కలు అయితే, ఏబిఎన్ ఛానెల్ లో అతని తరపున మాట్లాడిన వారు కూడా జంతువులు అవుతారా అని ఆయన ప్రశ్నించారు. రాధాకృష్ణ భాష దారుణంగా ఉందన్నారు. అది జర్నలిజాన్ని అవమానపరచడమేనన్నారు. కుక్కలు, నక్కలు ... అనే భాష సరైంది కాదన్నారు. భాష మార్చుకోమని సలహా ఇచ్చారు. తాము అటువంటి భాష వాడం అని చెప్పారు. వాస్తవానికి ఆ రకమైన భాష మాట్లాడినవారికి సమాధానం ఇవ్వవలసిన అవసరం కూడా లేదన్నారు. అది దమ్ము ఉన్న ఛానెల్ కాదు, దగ్గు సర్వరోగాలు ఉన్న ఛానెల్ అన్నారు.

తమ నేత జగన్ పై పదేపదే తప్పుడు కథనాలను ప్రసారం చేయడం జుగుప్సాకరంగా ఉందని చెప్పారు. ఇప్పటికీ తమ సవాల్ కు తాము సిద్దంగా ఉన్నామన్నారు. తాము సవాల్ చేసింది ఏమిటీ? మీరు మాట్లాడేది ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు. ఆర్ త్రయం (రాధాకృష్ణ, రవిప్రకాష్, రామోజీ రావు) వచ్చి వారు ప్రసారం చేసినవి రుజువు చేసి, ఆ భవనాన్ని తీసుకోమని చెప్పామని, ఇప్పటికీ ఆ మాటకి కట్టుబడే ఉన్నామని స్పష్టం చేశారు. మీడియా వారిని తీసుకొని ముగ్గురూ లేక ఒక్కరే వచ్చినా సరే అన్నారు. జగన్మోహన రెడ్డి నివాసంలో ఎస్కలేటర్లు, 150 సిసి కెమెరాలు, అనేక లిఫ్టులు, అధునాతన స్విమ్మింగ్ పూల్, హెలీప్యాడ్, విదేశీ బార్ ఉన్నాయని ప్రసారం చేశారు. మీరు వచ్చి వాటిని రుజువు చేయమని ఆయన సవాల్ విసిరారు.

ఆ పార్టీ మరో అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ జగన్ పై ఆరోపణలు రుజువు చేయకపోతే ఛానెల్ మూసుకుంటారా? అని రాధాకృష్ణని ప్రశ్నించారు. పాత తప్పుడు కథనాలనే ప్రసారం చేస్తూ, తమ నేతని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. జగన్ ని దెబ్బతీసే శక్తి ఎవరికీ లేదన్నారు.
source:
http://www.sakshitv.com/index.php?option=com_content&view=article&id=14736:2011-10-24-10-45-03&catid=109:2010-11-23-18-17-06&Itemid=757