Wednesday, December 7, 2011

Hats off to OUR MLAs: YS Jagan

 Hats off to OUR MLAs: YS Jagan

తోడు నిలిచిన ఎమ్మెల్యేలకు హ్యాట్సాఫ్: జగన్





హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా దమ్మూ ధైర్యం ఉంటే విప్ ఉల్లంఘించిన శాసనసభ్యులందరినీ అనర్హులుగా ప్రకటించి 17 నియోజకవర్గాల్లో ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి సవాలు విసిరారు. ఆయన మంగళవారం అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన ఎమ్మెల్యేలతో కలిసి తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అక్కడే విడిగా జాతీయ మీడియాతో కూడా మాట్లాడారు. ఒకసారి రెండు, మరో సారి నాలుగు ఇలా దశల వారీగా వారి ఇష్టానుసారం కాకుండా అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరపాలని అన్నారు. ఎన్నికలు దశల వారీగా నిర్వహిస్తూ మంత్రులను ప్రయోగించి, ధనబలాన్ని ఉపయోగించే కుటిల నీతిని ప్రదర్శించవద్దని ఆయన అన్నారు.

ఈ నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికల్లో ఎవరు సమీప ప్రత్యర్థిగా ఉంటారని భావిస్తున్నారని ప్రశ్నించగా ‘టీడీపీ, కాంగ్రెస్ రెండు పార్టీలకూడిపాజిట్లు రావు’ అని జగన్ సమాధానం ఇచ్చారు. తమ పదవులు పోతాయని తెలిసి కూడా ఒక విధానానికి కట్టుబడి ఎమ్మెల్యేలు విప్‌ను ఉల్లంఘించినందుకు వారికి హ్యాట్సాఫ్ అన్నారు. విప్‌ను ఉల్లంఘించ వద్దంటూ వై.ఎస్ అభిమాన ఎమ్మెల్యేలను బెదిరించారని జగన్ అన్నారు. ‘గొల్ల బాబూరావును పాయకరావు పేటలో అడుగు పెట్టనీయం అని బెదిరించారు. మా సోదరి సుచరిత భర్తపై సీబీఐ విచారణ వేయిస్తామని బెదిరించారు. బాలరాజు నియోజకవర్గంలో కూంబింగ్ తరహాలో ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులను దింపుతామని భయపెట్టారు. కానీ మా వారెవ్వరూ కించిత్ కూడా బెదరలేదు. అందుకే నేను గర్విస్తున్నా.!’ అని, ఎవరెవరు భయపెట్టారో చెప్పాల్సిందిగా జగన్ ఎమ్మెల్యేలను కోరారు.

తనను బొత్స బెదిరించారనీ సుచరిత, వసంత్‌కుమార్ తనతో అలా అన్నారని బాలరాజు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇంకొందరు ఎమ్మెల్యేలనైతే బయట కారు డిక్కీలో భారీగా నగదు ఉంచాం, మీరు ఊ, అంటే బయటకు వెళ్లి అలాగే తీసుకెళ్ల వచ్చునని మంత్రులు ప్రలోభ పెట్టి నీచ రాజకీయాలు చేశారని జగన్ అన్నారు. అసెంబ్లీని వేదికగా చేసుకుని ఎన్ని రకాలుగా రాజకీయాలను దిగజార్చాలో అన్నీ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అసలు చంద్రబాబు అవిశ్వాసాన్ని ఎందుకు పెట్టినట్లు? రైతుల కోసమేనా లేక రెండున్నరేళ్ల కిందట మరణించిన దివంగత నేత వై.ఎస్.ఆర్.ను అదేపనిగా విమర్శించడానికేనా అని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానంపై మాట్లాడేటప్పుడు కావాలనే వైఎస్‌ను విమర్శించి తమ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి అసలు ఓటింగ్ చేయకుండా వారు వెళ్లి పోవాలని బాబు కుటిల నీతిని ప్రదర్శించారని ఆయన విమర్శించారు. అయితే తమ ఎమ్మెల్యేలు మాత్రం ఎలాంటి కవ్వింపు చర్యలకు లోను కాకుండా, సంయమనం పాటించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని జగన్ అన్నారు. తమ ఎమ్మెల్యేలు రాజకీయ విలువలకు కొత్త నిర్వచనం చెప్పారని, ఇది దేశంలోనే చారిత్రాత్మకమైందనీ ఆయన ప్రశంసించారు. దేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా ఇంత పెద్ద సంఖ్యలో అధికారపక్షాన్ని ఎమ్మెల్యేలు ధిక్కరించి బయటకు రాలేదనీ ఓ రకంగా చూస్తే కిరణ్ సర్కారు పాలించే హక్కును నైతికంగా కోల్పోయినట్లేనని ఆయన అన్నారు. ఎమ్మెల్యేల ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం పడిపోవడం గానీ, కాపాడటం గానీ జరుగలేదనీ కేవలం చిత్తశుద్ధితో రాజకీయ విలువల కోసం తమ ఎమ్మెల్యేలు ఓట్లేశారని ఆయన అన్నారు.

చంద్రబాబునాయుడు ఇదే అవిశ్వాస తీర్మానాన్ని ఓ ఎనిమిది నెలల ముందు పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం కాక ముందు పెట్టి ఉంటే ప్రభుత్వం కూలిపోయి మధ్యంతర ఎన్నికలు వచ్చి ఉండేవని జగన్ అన్నారు. కానీ ఇపుడు అన్నీ సర్దుకున్నాక పెట్టడంలో అంతర్యం అందరికీ తెలుసునని ఆయన అన్నారు. ‘దేవుడు అన్నీ చూస్తున్నాడు...ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రండి ఎన్నికలకు పోదాం, ప్రజల్లోకి వెళదాం, వారెవరిని ఆదరిస్తారో చూద్దాం...’ అని జగన్ అధికార, ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలో రైతు పరిస్థితి దయనీయంగా ఉందనీ చెరుకు, ప్రత్తి, ధాన్యం ఏ పంట తీసుకున్నా ధరలు లేవు, ధాన్యం క్వింటాలు ధర 680 రూపాయలకు మించి లేదు. అలాగే రైతు కూలీలకు వంద రూపాయలకు మించి కూలీ ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యల పరిష్కారంపై అధికార, ప్రతిపక్షాలు రెండింటికీ చిత్తశుద్ధి లేదనీ ‘దొందు, దొందే!’ అని జగన్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు రైతులపై ప్రేమాభిమానాలతో ఈ అవిశ్వాసం పెట్టలేదనీ అధికార ప్రతిపక్షాలు ఒక్కటై కేవలం తమ ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టడానికి పెట్టిన తీర్మానం ఇదని జగన్ వ్యాఖ్యానించారు.
తమ ఎమ్మెల్యేల విజ్ఞతకూ, వారు తీసుకున్న నిర్ణయానికీ తనకు గర్వంగా ఉందని ఆయన అన్నారు. ఓ వైపు నుంచి అధికార పక్షం ప్రలోభాలు, బెదిరింపులు, మరో వైపు నుంచి చంద్రబాబు చిత్తశుద్ధి లేని రాజకీయాలు, కుటిల నీతి వీటన్నింటినీ తమ ఎమ్మెల్యేలు అధిగమించారని జగన్ అన్నారు. ఈ మొత్తం ఉదంతంలో చంద్రబాబునాయుడు తానొక రాజకీయ నాయకుడినని చెప్పుకునే అర్హతను కూడా కోల్పోయారని జగన్ అన్నారు. తన వెంట ఎందరు ఎమ్మెల్యేలు వచ్చారన్నది ముఖ్యం కాదనీ, ఎంత మంది విలువలకు కట్టుబడి వ్యవహరించారనేదే ప్రధానమని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

దీర్ఘకాలిక పోరాటం నాముందుంది

తన ముందు ఇంకా సుదీర్ఘమైన పోరాటం ఉందని జగన్ చెప్పారు. సీబీఐ విచారణలు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికే బళ్లారి గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఏమైందో తెలుసు కదా ఎంత విచారించినా ఏమీ లేదని తేలి పోయింది కదా అని జగన్ అన్నారు. సాక్షిలో పెట్టుబడులపై విచారణలు జరుగుతున్నాయి. మీడియాలో ఒక వర్గం పక్షపాతంతో వ్యవహరిస్తోంది. ఇది వరకు ఈ పత్రికల్లో చంద్రబాబుకు కావాలనుకునే కోణమే ప్రచురించే వారు. సాక్షి ఆవిర్భవించాక రెండో కోణం కూడా ప్రజలకు తెలుస్తోంది. దేశంలోనే సాక్షి 9వ స్థానంలో ఉంది. 14.5 లక్షల సర్కులేషన్ కలిగి ఉంది. 3.7 కోట్ల పాఠకులు ఈ పత్రికకు ఉన్నారని వివరించారు.

ఈ విలేకరుల సమావేశంలో ఎం.పి మేకపాటి రాజమోహన్ రెడ్డి, అవిశ్వాసాన్ని బలపర్చిన ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, కొండా సురేఖ, శోభా నాగిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ధర్మాన కృష్ణదాస్, కొరుముట్ల శ్రీనివాసులు, గొల్ల బాబూరావు, తెల్లం బాలరాజు, ఎం.ప్రసాదరాజు, చెన్నకేశవరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, బి.గురునాథరెడ్డి, ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.